ప్రసిద్ధ చిత్రకారుడు చంద్ర ఇక లేరు
ప్రఖ్యాత చిత్రకారుడు, రచయిత చంద్ర కన్ను మూశారు. తెలుగు చిత్ర కళ రంగంలో తనదైన ముద్రను వేసిన చంద్ర బుధవారం రాత్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.
హైదరాబాద్: ప్రఖ్యాత చిత్రకారుడు చంద్ర ఇక లేరు. ఆయన తుది శ్వాస విడిచారు. బుధవారం రాత్రి ఆయన సికింద్రాబాదులని కార్ఖానాలోని ఆర్కె మదర్ థెరెసా రీహాబిలిటేషన్ సెంటర్ లో మృతి చెందారు.
చంద్ర 1946 ఆగస్టు 28వ తేదీన జన్మించారు. ఆయన తెలంగాణలోని వరంగల్ కు చెందినవారు. ఆయన కథలు కూడా రాశారు. బి. నరసింగరావు సినిమాల్లో ఆయన నటించారు కూడా. ఓపెన్ యూనివర్శిటీలో ఆయన పాఠాలు కూడా చెప్పారు.
ఆయన తెలుగు పుస్తకాలకు లెక్క లేనన్ని పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు. వివిధ పత్రికల్లో కథలకు బొమ్మలు గీశారు. ఆయన చిత్రాలది ప్రత్యేకమైన శైలి. ఆయన మృతికి సాహిత్య, కళరంగాలకు చెందినవారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.