తెలంగాణలో నకిలీ ఓటరు కార్డులు వెలుగు చూశాయి. ఏకంగా ఎన్నికల అధికారుల పేరుతో నకిలీ ఓటరు కార్డులు జారీ చేయడంపై వివాదానికి కేంద్రంగా మారింది


హైదరాబాద్: తెలంగాణలో నకిలీ ఓటరు కార్డులు వెలుగు చూశాయి. ఏకంగా ఎన్నికల అధికారుల పేరుతో నకిలీ ఓటరు కార్డులు జారీ చేయడంపై వివాదానికి కేంద్రంగా మారింది.ఇప్పటికే ఓటరు జాబితాపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ హైకోర్టు, సుప్రీంకోర్టును కూడ ఆశ్రయించింది.

హైద్రాబాద్‌లోని మెహిదీపట్నం కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్, మాజీ సీఈసీ ఓపీ రావత్ పేర్లతో ఓటరు కార్డులు జారీ అయ్యాయి. ఎన్నికల సంఘంలో ఓపీ రావత్ రిటైరయ్యారు.రజత్‌కుమార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా కొనసాగుతున్నారు.

మెహిదీపట్నంలోనే వీరిద్దరికి ఓటరు కార్డులు జారీ చేయడంపై జీహెచ్ఎంసీ అధికారులు అంతర్గతంగా విచారణ జరిపారు. ఈ విషయమై వాస్తవాలను తేల్చేందుకు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.జీహెచ్ఎంసీ వార్డు నెంబర్ 10లో ఈ ఇద్దరు ఎన్నికల అధికారులపైన నకిలీ ఓటరు కార్డులు జారీ అయ్యాయి.ఈ విషయాన్ని సీఈసీ కూడ సీరియస్‌గా తీసుకొంది. ఈ ఘటనపై సీఈసీ కూడ ఆగ్రహం వ్యక్తం చేసింది.