ఆటో డ్రైవర్తో అక్రమ సంబంధం.. బోనాల పండుగకు రప్పించి భర్త హత్య..
Yadadri Bhuvanagiri: వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ భార్య తన భర్త ప్రాణాలు తీసింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు పాల్పడిన ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా లో చోటుచేసుకుంది. ముందు హత్యకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఈ షాకింగ్ విషయాలు తెలిశాయి.
extramarital affair-husband murder by wife:అక్రమ సంబంధాలు మానవ బంధాలను మరింత క్షీణింపజేస్తున్నాయి. సొంతవాళ్లనే కడతేర్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ భార్య తన భర్త ప్రాణాలు తీసింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు పాల్పడిన ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా లో చోటుచేసుకుంది. ముందు హత్యకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఈ షాకింగ్ విషయాలు తెలిశాయి.
వివరాల్లోకెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు మృతుని మెడపై గాయాలు కనిపించడంతో హత్యగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో మృతుని భార్య హత్యకు కుట్ర చేయగా, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. సోమవారం అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను డీసీపీ రాజేష్ చంద్ర భువనగిరిలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.
శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన ధనలక్ష్మి, ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన సల్ల సైదులుకు పన్నెండు ఏండ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైదులు బోర్వెల్పై డ్రిల్లర్గా పనిచేస్తున్నారు. పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే, కొన్ని వారాల పాటు పనిచేసే ప్రాంతంలో ఉండాల్సి వచ్చేది. సమయ దొరికినప్పుడల్లా ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్య ధనమ్మ ఎక్కువగా తన పుట్టింటి వద్ద ఉండేది. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎండ్ల నవీన్ తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. మూడేండ్లుగా వీరి సాన్నిహిత్యం కొనసాగుతోంది.
అయితే, ధనమ్మ ఎక్కువగా పుట్టింటికి వెళ్తుండటం పై సైదులు వారించాడు. భార్య తీరుపై అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మనస్పర్థలు ఏర్పడి, గొడవలు జరిగాయి. అయితే, ఇరువురి కుటుంబ పెద్దలు సర్దిచెప్పడంతో కాపురం బాగానే సాగుతోంది. కానీ, తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భార్య, ఆమె ప్రియుడు కలిసి సైదులు హత్యకు కుట్ర పన్నారు. బోనాల పండుగ కోసమని సైదులు, ధనలక్ష్మి, పిల్ల లను తీసుకుని ఈ నెల 10వ తేదీన గురజాలలోని పుట్టింటికి వచ్చారు. తాము అనుకున్న కుట్ర ప్రకారం సైదులును హత్య చేసేందుకు నవీన్ తన సమీప బంధువు స్వామి సహాయం తీసుకున్నారు.
అనుకున్నట్టుగానే సైదులును తీసుకుని మద్యం తాగడానికి నవీన్, స్వామి ఇద్దరూ కలసి ఆటోలో అమ్మనబోలుకు వెళ్లారు. మద్యం తాగిన తర్వాత.. ఇద్దరు నిందితులు నవీన్, స్వామిలు సైదులును హత్య చేశారు. ఆ తర్వాత ఆటోలో డెడ్ బాడీని తీసుకుని మోత్కూరులోని పొడిచేడు మూసీ నది బ్రిడ్జి వద్ద చనిపోయాడో లేదో నని ఆటో స్టార్ట్ చేసే తాడుతో గొంతు అదిమిపట్టి ప్రాణాలు తీశారు. ఈ తర్వాత మృతదేహాన్ని మూసీ నది ఒడ్డున గంగదేవమ్మ ఆలయం సమీపంలో పడవేసి వెళ్లిపోగా, మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మెడపై గాయాలు చూసి హత్య ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. అయితే, నిందితుడు నవీన్ తనకు ఏమీ తెలియనట్టు అదే ఆటోలో ధనలక్ష్మి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆటోలో ఘటనా స్థలానికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే డాగ్ స్క్వాడ్ ఆటో చుట్టూ తిరగడం, నవీన్ వద్దకు వెళ్లడంతో అనుమానంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరపగా చేసిన నేరం ఒప్పుకునీ, తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో నిందితులైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.