అక్బరుద్దీన్తో కాంగ్రెస్ నేతల భేటీ .. కష్టసుఖాలు మాట్లాడుకున్నామన్న శ్రీధర్ బాబు, కానీ
అసెంబ్లీ ఆవరణలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తమ మధ్య ఫ్రెండ్లీగానే సమావేశం జరిగిందని, రాజకీయాలు మాట్లాడలేదని ఆయన చెప్పారు.
అసెంబ్లీ ఆవరణలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం కూడా సెక్యులర్ అంటుంది కాబట్టే తాము మాట్లాడామన్నారు. ఎంఐఎంతో మాట్లాడితే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మరోనేత శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అక్బరుద్దీన్తో జరిగింది రాజకీయ భేటీ కాదని తేల్చేశారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఫ్రెండ్లీగా తాము మాట్లాడుకున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. ఇందులో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా తెలిసిన వ్యక్తి కావడంతో మంచి చెడు కనుక్కున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ ఈ సందర్భంగా మాతో చెప్పారని ఆయన వెల్లడించారు.
కాగా.. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం సుధీర్ఘకాలం పాటు మిత్రపక్షంగా ఉంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఎంఐఎం బీఆర్ఎస్ తో మిత్రపక్షంగా కొనసాగుతుంది. అయితే రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది . గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సమయంలో అక్బరుద్దీన్ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ పై చర్చ సమయంలో ప్రసంగిస్తున్నట్టుగా అక్బరుద్దీన్ తీరు ఉందన్నారు. ఏడురుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎంకు ఇంత సమయం ఇస్తే వందకు పైగా ఎమ్మెల్యేలున్న తమ పార్టీకి ఎంత సమయం కేటాయించాలని మంత్రి కేటీఆర్ స్పీకర్ ను కోరారు.
ALso REad: అక్బర్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం: నేడు ఓవైసీతో మల్లు భట్టి విక్రమార్క భేటీ
దీనికి అక్బరుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 50 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాదు తమ పార్టీ 15 మంది ఎమ్మెల్యేలను గెలుస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే విషయమై తమ పార్టీ అధినేతతో మాట్లాడుతానని కూడా అక్బరుద్దీన్ ఓవైసీపీ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.