మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ తొలి జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు టికెట్ లభించకపోవడంతో ఏం చేయాలనే దానిపై ఆయన అనుచరులతో రేపు కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. 

బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటనతో ఆ పార్టీలో టికెట్ దక్కని ఆశావహులు అసమ్మతి రాగాలు ఆలపిస్తున్నారు. కొందరు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ తొలి జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మోత్కుపల్లి అలకబూనారు. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు రేపు యాదగిరిగుట్టలో అనుచరులతో సమావేశం నిర్వహించనున్నారు నర్సింహులు. 

మరోవైపు.. టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్‌లో చేరగా, తుమ్మల నాగేశ్వరరావు, వేముల వీరేశం, తాటికొండ రాజయ్య తదితరులు అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. అయితే వీరిలో కొందరిని బుజ్జగించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. అయితే వచ్చే కొద్దిరోజుల్లో అసంతృప్త నేతల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also Read: Telangana Politics: బీఆర్ఎస్ లో అసమ్మతిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్.. ప్రయత్నాలు ఫలించేనా..?

కాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజే అసమ్మతి కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైందని జిల్లాల నుంచి వస్తున్న నివేదికలు చెబుతున్నాయి. టిక్కెట్లు నిరాకరించిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులకు ఇతర అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి బుజ్జగించగలిగారు బీఆర్ఎస్ అధినేత‌. వాస్తవానికి ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం, అది కూడా ఎన్నికలకు 3-4 నెలల ముందు ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి కేసీఆర్ చేసిన మాస్టర్ స్ట్రోక్ గా భావిస్తున్నారు. 

కాంగ్రెస్, బీజేపీలు ఒకేసారి తమ అభ్యర్థులను ప్రకటించే సాహసం చేస్తూ అధికార పార్టీ దీన్ని తన ఆత్మవిశ్వాసంగా చూపించేందుకు ప్రయత్నిస్తోంది. కేవలం ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే కేసీఆర్ టికెట్లు నిరాకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ధీటైన సమాధానం ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.