ప్రజా దీవెన పేరిట టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మునుగోడు లో నీకు మూడు చెరువుల నీళ్లు తాగించడం పక్కా అంటూ సీఎం కేసీఆర్ను హెచ్చరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కొండా సురేఖ. శనివారం ప్రజా దీవెన పేరిట టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో సురేఖ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
‘‘ తెలంగాణ ఉద్యమాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నల్లగొండ జిల్లా వాసులది నాడు నలిగిపోయిన చరిత్ర, అధికారం వచ్చాక ఉద్యమకారులను నలిపేసిన చరిత్ర నీది..! ఆనాడు నీ విషపు కోరల్లో బందీ అయినారు.! కానీ నేడు మునుగోడు లో నీకు మూడు చెరువుల నీళ్లు తాగించడం పక్కా కెసిఆర్ ’’ అంటూ సురేఖ నిప్పులు చెరిగారు.
అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం మొత్తం మునుగోడు వైపు చూస్తోందన్నారు. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించిందన్నారు. తెలంగాణ వస్తేనే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని భావించామని రేవంత్ చెప్పారు. కానీ 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపలేదని ఆయన విమర్శించారు. కమ్యూనిస్టులు అమ్ముడుపోవడం దురదృష్టకరం అంటూ టీపీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్ చేశారు. వారు ఇన్నాళ్లూ చేసిన పోరాటాలు వృథా అయిపోతాయని హెచ్చరించారు.
రాజీనామాల ద్వారానే నిధులు వస్తాయని బీజేపీ చెబుతందని.. అలాంటప్పుడు బీజేపీలోని నలుగురు ఎంపీలను రాజీనామా చేయించి నిధులు తీసుకురావాలని రేవంత్ సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏ గ్రామాలకు నిధులు వచ్చాయో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీటీసీలను, సర్పంచ్లను, ఎంపీపీలను కూడా బీజేపీలో చేర్చుకున్నారని.. మరి వారిచేత ఎందుకు రాజీనామా చేయించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. అలా చేస్తే ఆయా గ్రామాలకు కూడా నిధులు వస్తాయి కదా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
