ధరణితో భూముల కబ్జా.. రైతుల జోలికొస్తే నీ భరతం పడతాం : కేసీఆర్కు ఈటల హెచ్చరిక
రైతుల భూములు కబ్జా చేయడానికే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మట్టిని నమ్ముకున్న రైతుల జోలికి వస్తే నీ భరతం పడతామంటూ ఈటల హెచ్చరించారు.
రైతుల భూములు కబ్జా చేయడానికే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. శనివారం శామీర్పేట మండలం బొమ్మరాజు పేటకు చెందిన రైతులకు ఆయన మద్ధతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న 1050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూమిని సీఎం కేసీఆర్ బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారని రాజేందర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ధర్నాకు అనుమతి ఇచ్చి.. ఆపై అరెస్ట్ చేయడం ఏంటని ఈటల ప్రశ్నించారు. ధరణిలో లక్షలాది మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని ఆ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.
తెలంగాణ వచ్చాక శాశ్వతంగా భూముల సమస్యలు పరిష్కరిస్తానన్న కేసీఆర్.. ధరణిని తెచ్చింది కొంపలు ముంచడానికా అని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 1999 నుంచి ఇక్కడే వుంటున్నానని.. ఇక్కడ వున్న వారంతా తనకు తెలుసునని ఈటల తెలిపారు. చాలా మంది రైతులు ద్రాక్ష తోటలు ఫౌల్ట్రీ ఫాం పెట్టుకున్నారని.. ఇప్పుడు ధరణి పోర్టల్ పెట్టి కేసీఆర్ మనుషులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టిని నమ్ముకున్న రైతుల జోలికి వస్తే నీ భరతం పడతామంటూ ఈటల హెచ్చరించారు.
ALso Read: బీజేపీలోనే బతుకుతా... చనిపోతా: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
కాగా.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై కమలనాథులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికి బండి సంజయ్ స్థానంలో అందరిని కలుపుకునిపోయే నేత కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించింది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేడర్లో కొంత నైరాశ్యం ఏర్పడింది. అయితే మోడీ వరంగల్ సభ తర్వాత నేతల్లో కొంత జోష్ వచ్చింది. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్దేనంటూ మోడీ విమర్శలు చేశారు. ఇదే ఊపును జనాల్లోకి తీసుకెళ్లేందుకు కిషన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు.
దీనిలో భాగంగా ఇవాళ్టీ నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది. 19 ఎస్సీ నియోజకవర్గాలు, 12 ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. రెండు వారాల్లోనే 31 సభలు ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ సభలకు బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు.