ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మాజీ డిప్యూటీ సీఎం..
చమురు ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ తీరుపై దామోదర రాజనర్సింహ ఎడ్ల బండి పై నుండి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో బెదిరిన ఎడ్లు పరిగెత్తేందుకు ప్రయత్నించాయి.
మెదక్ జిల్లా కేంద్రంలో పెట్రోలు,డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో అపశృతి చోటు చేసుకుంది. ఎడ్లబండి పైనుండి ప్రసంగిస్తుండగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జారి కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలికి స్వల్ప గాయం అయింది.
దీంతో ఆయనను కార్యకర్తలు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చమురు ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ తీరుపై దామోదర రాజనర్సింహ ఎడ్ల బండి పై నుండి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో బెదిరిన ఎడ్లు పరిగెత్తేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కింద పడ్డారు. కాగా, చికిత్స అనంతరం కోలుకున్న దామోదర కాలినడకన నిరసన ర్యాలీ చేపట్టారు.
పెట్రో ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. స్థానిక నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. పెట్రోలు డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ధర్నాచౌక్లో సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండి తో నిరసన తెలిపారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, గీతా రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఫిరోజ్ ఖాన్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
అటు వరంగల్ అర్భన్ జిల్లాలో, కాజీపేటనుంచి హన్మకొండ చౌరస్తా వరకు సైకిళ్లు, ఎడ్ల బండ్లు, రిక్సాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.