బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారా?.. క్లారిటీ ఇదే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ పార్టీ మారబోతున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని.. ఆయన త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరతానే ప్రచారం సాగుతుంది. అయితే ఇందుకు సంబంధించి ఈటల రాజేందర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. పార్టీలు మారడం తన పద్దతి కాదని.. తనను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు ప్రచురించడం సరికాదని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
‘‘ఈరోజు కొన్ని వార్తాపత్రికలలో ప్రచురితమైన తప్పుదారి పట్టించే సమాచారాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కేసీఆర్ నియంతృత్వ పాలన అంతం కావాలని తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారన్నారు. గౌరవనీయులైన ప్రధాని మోదీ, బీజేప జాతీయ అధ్యక్సుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ పార్టీ మాత్రమే దీనిని చేయగలదు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఐక్యంగా ఉండి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. పార్టీలు మారడం నా పద్ధతి కాదు, నన్ను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు ప్రచురించడం సరికాదు’’అని ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు.