తెలంగాణలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నారు. అధికార బీఆర్ఎస్ మరోమారు విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది.
తెలంగాణలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నారు. అధికార బీఆర్ఎస్ మరోమారు విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీకి చెందిన 30 ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంది. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల కుమారులు లేదా కుటుంబ సభ్యులు ప్రజల్లో తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడంపై వీరు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు కుమారుడు విజిత్రావు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరగడం ప్రారంభించి.. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల బెల్లంపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు కూడా హాజరయ్యారు. ఢిల్లీలో కేసీఆర్ చేతుల మీదుగా జరిగిన బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా ఆయన హాజరయ్యారు. దివాకర్ రావు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు విజిత్ను పోటీ చేయించాలనే ఉద్దేశంతో ఉన్నారని స్థానిక బీఆర్ఎస్లో చర్చ జరుగుతుంది.
మరోవైపు నిర్మల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. రానున్న ఎన్నికల్లో తన కోడలు దివ్యారెడ్డి పేరును ఆయన పరోక్షంగా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మల్ జిల్లాలో పార్టీలో తగిన గుర్తింపు కోసం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్, వేణుగోపాలాచారి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
ఇక, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జోగు రామన్న రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఆయన పెద్ద కొడుకు జోగు ప్రేమేందర్ను మున్సిపల్ చైర్మన్గారు. మరోవైపు చిన్న కొడుకు మహేందర్ ఆయన తరఫున పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ విధంగా పలు నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. రానున్న ఎన్నికల్లో తమ వారసులను పోటీ చేయించేందుకు లేదా మరేదైనా పదవులు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతుంది.
అయితే బీఆర్ఎస్ అధిష్టానం వారిని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నారు. తద్వారా జనంలో పెద్దగా ప్రజాదరణ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
