సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ గల ఎర్రవల్లిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని పోలీసులు అనుమతివ్వలేదు. అయినా కాంగ్రెస్ పార్టీ వెనక్కితగ్గక పోవడంతో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటివద్దకు భారీగా పోలీసులు చేరుుకున్నారు.   

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)  రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టిపిసిసి (tpcc) అధ్యక్షులు రేవంత్ రెడ్డి (revanth reddy) ఇవాళ(సోమవారం) నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రైతులు వరి వేస్తే ఉరేనని... ఎవరూ వరి వేయవద్దంటున్న కేసీఆరే (KCR) ఏకంగా 150ఎకరాల్లో వరి పండిస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. ఈ  విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికంటూ సీఎం ఫాం హౌస్ గల సిద్దిపేట జిల్లా (siddipet district) ఎర్రవల్లిలోని రచ్చబండకు పిలుపునిచ్చారు. 

అయితే కరోనా, ఒమిక్రాన్ (omicron) వేరియంట్ వ్యాప్తితో సహా వివిధ కారణాల రిత్యా కాంగ్రెస్ పార్టీ (congress party) తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతించలేదు. అయినా రేవంత్ రెడ్డి ఎట్టిపరిస్థితుల్లో ఎర్రవల్లికి చేరుకుని నిరసన తెలియజేయాలని పట్టుదలతో వున్నాడు. దీంతో ఆయనను హైదరాబాద్ (hyderabad) లోనే అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం రేవంత్ ఇంటికి ఇప్పటికే భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  

read more  ఎన్నికల కోసమే సాగు చట్టాలు వెనక్కి.. మళ్లీ తోమర్ వ్యాఖ్యలేంటీ : రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఇక ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో పలువురు కాంగ్రెస్ నాయకులకు పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దుబ్బాకలో ఆరుగురు, భూంపల్లిలో ఐదుగురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అలాగే సిద్దిపేట జిల్లాలో పలవురు నాయకులను ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు.  

అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి తీరతామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డంకులను తప్పించుకుని ఎర్రవల్లికి వస్తారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలావుంటే రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన ఈ రచ్చబండ కార్యక్రమంలో సొంత పార్టీలోనే చిచ్చు పెట్టింది. రేవంత్ వ్యవహారశైలిని మొదటినుండి తప్పుబడుతూ వస్తున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. ఎర్రవల్లిలో తలపెట్టిన రచ్చబండి కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లుగా జగ్గారెడ్డి (jagga reddy)ప్రకటించారు.

read more  నేడే బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష.. ఎక్కడంటే...

పార్టీ నాయకులందరినీ కలుపుకుని పోవాల్సిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అందరినీ విభజించి కార్యక్రమాలు ప్రకటిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై తాను అధిష్టానానికి లేఖ రాస్తానని హెచ్చరించారు. పీఏసీలో చర్చించకుండానే రేవంత్ కార్యక్రమాలు ప్రకటిస్తున్నారని.. ఆ హక్కు ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎర్రవల్లి రచ్చబండ కార్యక్రమాన్ని కూడా పార్టీలో చర్చించకుండా సొంతంగా నిర్ణయించారని... అందువల్లే ఇందులో తాను పాల్గొనబోనని జగ్గారెడ్డి స్పష్టం చేసారు. 

గతంలో కూడా తన సొంత జిల్లాలో జరిగిన కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంతో జగ్గారెడ్డి గరం అయ్యారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ గురించి తనకే కాదు స్థానిక మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. సంగారెడ్డి వచ్చిన రేవంత్ రెడ్డి తనకు సమాచారం ఇవ్వకపోవడమేంటని ఆయన అడిగారు. కనీసం ప్రోటోకాల్ పాటించాలి కదా అని నిలదీసారు. 

ఇలా ప్రతిసారీ రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్న జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ సంగారెడ్డి పర్యటన సమయంలో జగ్గారెడ్డి చాలా క్లోజ్ గా వున్నారు. దీంతో కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడానికి జగ్గారెడ్డి రంగం సిద్దం చేసుకున్నారన్న ప్రచారం ఊపందుకుంది.