ఎన్నికల షెడ్యూల్ మరింత ఆలస్యం...
తెలంగాణలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ నోటిషికేషన్ పై సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుందా అంటూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో కలిసి జరుగుతాయా లేక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సెపరేట్ గా జరుగుతాయా..అన్న అనుమానాలు ప్రతీ ఒక్కరి మదిలో మెదులుతున్నాయి.
ఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ నోటిషికేషన్ పై సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుందా అంటూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో కలిసి జరుగుతాయా లేక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సెపరేట్ గా జరుగుతాయా..అన్న అనుమానాలు ప్రతీ ఒక్కరి మదిలో మెదులుతున్నాయి. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ హస్తిన పర్యటన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ పై తుది నిర్ణయం వెలువడుతుందని ఆశించారు.
అయితే ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి శనివారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. దాదాపు అక్టోబర్ మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.
అంతకుముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులతో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ ఓటర్ల జాబితా...కోర్టు కేసులు, ఈవీఎంల పనితీరు వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘంకు వివరించారు.
దీనికి సంబంధించి నివేదికను సైతం సమర్పించారు. మరో వైపు ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తుది విచారణ పూర్తయ్యే వరకూ ఓటర్ల జాబితా విడుదల చేయవద్దని ఆదేశించిన నేపథ్యంలో దీనిపై కూడా సిఈసీ తో చర్చించారు. ఈనెల 10న ఈసీ బృందం హైదరాబాద్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.