డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు: నేతలతో కేసీఆర్ కీలక భేటీ
డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రేపు ఓటర్ల లిస్టు విడుదల కానుంది, దీపావళి తర్వాత షెడ్యూల్ వుండే అవకాశం కూడా వుంది.
డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రేపు ఓటర్ల లిస్టు విడుదల కానుంది, దీపావళి తర్వాత షెడ్యూల్ వుండే అవకాశం కూడా వుంది.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నద్ధతపై ప్రగతి భవన్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. మంత్రులు, కీలక నేతలతో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ, పార్టీ పరిస్థితిపై సమావేశంలో చర్చిస్తున్నారు.
ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఎన్నికల నిర్వహణపై స్పష్టతకు వచ్చే అవకాశం వుంది. మరోవూపు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం సమావేశమైంది.
ఆయా పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఎస్ఈసీ... దీపావళి పండుగ అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Also Read:దుబ్బాక ఫలితాలపై కేసీఆర్ పోస్టుమార్టం: పార్టీ నేతలతో భేటీ
ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలతో జరిపిన వరుస భేటీల్లో భాగంగా సీపీఐ, బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల, ఆంటోని రెడ్డిలు పాల్గొన్నారు. అన్నిపార్టీలతో గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై కమిషనర్ చర్చించారు.
కాగా ఈ భేటీలకు గుర్తింపు పొందిన 11 పార్టీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆహ్వానించింది. ఒక్కో రాజకీయ పార్టీకి 15 నిమిషాల సమయం కేటాయించి, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై సమాలోచనలు జరిపింది.