ఎంపీ నామా కి షాకివ్వనున్న ఈడీ డైరెక్టర్లు..?
రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలను అందుకే ఖర్చు చేయాల్సింది పోయి వేరే మార్గాల ద్వారా ఎందుకు పంపించాల్సి వచ్చిందన్న విషయంపై ఈడీ ఆరా తీస్తోంది.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కి ఈడీ డైరెక్టర్లు షాకివ్వనున్నారా అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. నామాకు చెందిన రాంచీ ఎక్స్ ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్లను త్వరలోనే ఈడీ ప్రశ్నించనుందని సమాచారం.
ఈ కంపెనీ నుంచి పలు కారణాలు చెప్పి, ఇతర కంపెనీలకు మళ్లించిన రూ.264 కోట్ల విషయంపై ఆరా తీసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలను అందుకే ఖర్చు చేయాల్సింది పోయి వేరే మార్గాల ద్వారా ఎందుకు పంపించాల్సి వచ్చిందన్న విషయంపై ఈడీ ఆరా తీస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు ముగ్గురు డైరెక్టర్లను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు.
రూ.1,151 కోట్ల విలువైన రాంచీ-రార్గావ్- జంషెడ్పూర్ వరకు 163 కి.మీ. మేర ఉన్న ఎన్హెచ్–33 4 లేన్ల రహదారి పనుల ప్రాజెక్టును మధుకాన్ కంపెనీ 2011లో దక్కించుకుంది. ఇందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కింద రాంచీ ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్లుగా కె.శ్రీనివాస్రావు, ఎన్.సీతయ్య, ఎన్.పృథ్వీతేజ వ్యవహరిస్తున్నారు.