ఢిల్లీ లిక్కర్ స్కాం : ఈడీ దూకుడు, నిందితుల ఆస్తులు అటాచ్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఢిల్లీ జోర్ బాగ్, మంగోలియాలో వున్న మరికొందరు నిందితుల ఆస్తుల్ని కూడా అటాచ్ చేసింది ఈడీ.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. దీనిలో భాగంగా నిందితుల ఆస్తుల్ని అటాచ్ చేసింది. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ ఇళ్లను అటాచ్ చేసింది. వీరితో పాటు దినేశ్ అరోరా రెస్టారెంట్ను కూడా ఈడీ అటాచ్ చేసింది. అలాగే ఢిల్లీ జోర్ బాగ్, మంగోలియాలో వున్న మరికొందరు నిందితుల ఆస్తుల్ని కూడా అటాచ్ చేసింది ఈడీ.
ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితుల జ్యూడీషియల్ కస్టడీని జనవరి 7న పొడిగించింది న్యాయస్థానం. విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల జ్యూడీషియల్ కస్టడీని ఈ నెల 28 వరకు పొడిగించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న నలుగురు నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.
ALso REad: ఢిల్లీ లిక్కర్ స్కాం : నలుగురు నిందితుల జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు, ఎవరెవరంటే..?
ఇకపోతే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). 13567 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ ఇందులో 12 మంది పేర్లను ప్రస్తావించింది. ప్రధానంగా సౌత్ గ్రూప్ నుంచి జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల ఆధారాలను ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు సమాచారం. సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, బినయ్ బాబు, విజయ్ నాయర్, అమిత్ అరోరా, దినేష్ అరోరా, కుల్దీప్,నరేంద్ర సింగ్ , గౌతమ్, అరుణ్ పిళ్లైతో పాటు సమీర్ కంపెనీల్ని ఈడీ ప్రస్తావించింది. అయితే ఈ ఛార్జ్షీట్లోనూ ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా పేరు చేర్చకపోవడం గమనార్హం.
ఇక, ఈ కేసులో ఇప్పటికే ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు పాత్రపై ఈడీ అధికారులు చార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జ్షీట్లో ఈడీ అధికారులు.. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిలతో పాటు తదితరుల పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.