కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మీద ఈసీ మూడేళ్ల పాటు నిషేధం
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మీద సీఈసీ వేటు వేసింది. మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా బలరాం నాయక్ మీద ఈసీ వేటు వేసింది. మరింత మందిపై కూడా ఈసీ నిషేధం విధించింది.
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి బాలరాం నాయక్ మీద కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వేటు వేసింది. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. 2019 లోకసభ ఎన్నికలకు సంబంధించి గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను బలరాం నాయక్ ఈసీకి సమర్పించలేదు. దాంతో ఆయనపై ఈసీ వేటు వేసింది.
బలరాం నాయక్ మీద వేటు వేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ నోటిఫికేషన్ జారీ చేశారు. బలరాం నాయక్ 2009 ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున లోకసభకు పోటీ చేశారు. ఆ తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రి పనిచేశారు.
అనర్హత వేటు కారణంగా బలరాం నాయక్ మూడేళ్ల పాటు లోకసభ ఉభయ సభలకు, శాసనసభకు, శాసన మండలికి పోటీ చేసే అర్హత కోల్పోయారు. మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరు వేంకటేశ్వర రావు, నల్లగొండ నుంచి పోటీ చేసిన బహుజన ముక్కి పార్టీ అభ్యర్థి వెంకటేష్, స్వతంత్ర అభ్యర్థి రోయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హనుమంత రెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది.