అందుకే నేను కరోనా టీకా తీసుకోలేదు: భావోద్వేగానికి గురైన ఈటెల రాజేందర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిలో కరోనా టీకా కార్యక్రమాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. తాను టీకా తీసుకోకపోవడానికి గల కారణాన్ని వివరించారు.
హైదరాబాద్: ప్రాణాలకు తెగించి డాక్టర్స్, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనాపై యుద్ధం చేశారని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రాణ త్యాగం కూడా చేశారని అంటూ వారిని గుర్తు చేసుకొని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. వారికి ముందు వాక్సిన్ అందించాలని ప్రధాని సూచించారని, మొదటి వాక్సిన్ సఫాయి కర్మచారికే ఇచ్చామని, అందుకే తాను ఈ రోజు వాక్సిన్ తీసుకోలేదని ఆయన చెప్పారు.
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్, మేయర్ పాపాలాల్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, డిఎంహెచ్ఓమాలతితదితరులు ఉన్నారు.
కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియకు నిర్మల్ జిల్లాలో అటవీ, పర్యావరణ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వాక్సిన్ పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూశారని, కరోనా వైరస్కు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్ల వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
కోవిడ్ టీకా వచ్చింది కదా అని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా సరైన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. మాస్క్లు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించాలని కోరారు.