ఫ్రెండ్ షిప్ డే విషాదం: హైదరాబాదులో యువతి ప్రాణం తీసిన డ్రంకెన్ డ్రైవ్
ఫ్రెండ్ షిపి డే సరదా ఓ యువతి ప్రాణం తీసింది. హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో కారు పల్టీ కొట్టి ఆశ్రిత అనే యువతి మృత్యువాత పడింది. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్: ఫ్రెండ్ షిప్ డే రోజున హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం ఓ యువతి ప్రాణం తీసింది. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కారు పల్టీ కొట్టి ప్రమాదం సంభవించింది.
ఆ ప్రమాదంలో ఆశ్రిత అనే యువతి మృత్యువాత పడింది. మరో ముగ్గురు గాయపడ్డారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా నలుగురు మిత్రులు కొండాపూర్ ప్రాంతంలోని ఓ పబ్ కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించి రాత్రి ఇళ్లకు కారులో తిరుగు ప్రయాణమయ్యారు.
ఫ్రెండ్ షిప్ డే తో పాటు ఆదివారం కూడా కావడంతో పోలీసులు డ్రెంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పోలీసులను తప్పించుకునేందుకు కారును గల్లీల్లోకి మళ్లించారు. కారులో అభిషేక్, సాయి ప్రకాశ్, తరుణి, ఆశ్రిత ఉన్నారు. అభిషేక్ కారు నడుపుతున్నాడు.
గల్లీలో కారును నడిపిన అభిషేక్ డాంబర్ రోడ్డు తర్వాత వచ్చి మట్టి రోడ్డును గమనించలేదు. వేగంగా మట్టి రోడ్డు మీదికి వచ్చింది. దాంతో బ్రేక్ వేసే ప్రయత్నం చేశాడు. అయితే, అప్పటికే కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆశ్రిత మరణించింది. ఆమె కెనడాలో బిటెక్ చదువుతోంది. అభిషేక్, సాయి ప్రకాశ్ సీటు బెల్టు పెట్టుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.