Asianet News TeluguAsianet News Telugu

నూతన సంవత్సరం గిఫ్ట్: హైదరాబాద్ నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్

హైదరాబాదు నుంచి అమెరికాకు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి డైరెక్ట్ గా విమాన యానం చేయవచ్చు. హైదరాబాదు నుంచి చికాగోకు నేరుగా విమాన సర్వీసు సౌకర్యం ఏర్పడుతోంది.

Dirct flight from Hyderabad to USA from Jan 15, 2021
Author
Hyderabad, First Published Dec 10, 2020, 6:56 AM IST

హైదరాబాద్: జనవరి 2021 నుండి హైదరాబాద్ నుంచి అవకాశాల నేల అమెరికాకు డైరెక్ట్ కనెక్షన్ కోసం చేస్తున్న దీర్ఘకాల నిరీక్షణకు తెర పడనుంది.  జిఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని చికాగోకు కొత్త డైరెక్ట్ కనెక్షన్ ప్రారంభం కానుంది. జాతీయ విమానయాన సేవాసంస్థ ఎయిర్ ఇండియా 2021 జనవరి 15 నుండి హైదరాబాద్ - చికాగోల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభించనుంది. బోయింగ్ 777-200 విమానాలతో నడిచే ఈ సర్వీసులో సీట్ల సామర్థ్యం 238 (8 ఫస్ట్ క్లాస్ + 35 బిజినెస్ క్లాస్ + 195 ఎకానమీ క్లాస్). 

హైదరాబాద్-అమెరికా-హైదరాబాద్ మధ్య ఏటా 7,00,000 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి ఆస్కారమున్నా దానికి తగిన అవకాశాలు లేవు. హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారంలాంటిది. ఇది సమీప నగరాల నుండి వచ్చే ప్రయాణీకులకు అనుకూలంగా కూడా ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతిలాంటి నగరాల నుంచి అమెరికాకు యేటా దాదాపు 2,20,000 మంది ప్రయాణికుల డిమాండ్ ఉంది.  

ప్రదీప్ పణికర్, సిఇఒ, జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మాట్లాడుతూ “అమెరికాలోని చికాగో, హైదరాబాద్‌ను కలిపే ఈ కొత్త కనెక్షన్ కొంతకాలంగా కనెక్టివిటీ కావాలని కోరుతున్న జాబితాలో ఉంది. ఈ సర్వీసును మన స్వంత జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా ప్రారంభించడం ఎంతో సంతోషకరం. ఈ కనెక్షన్ ప్రారంభించటం వల్ల హైదరాబాద్ నుండి అమెరికాకు సరాసరి విమానాల కోసం ఎదురుచూస్తున్న రెండు గమ్యస్థానాల ప్రయాణీకులకూ ఆనందదాయకం. ప్రయాణీకుల డిమాండ్లను తీర్చడానికి,  గమ్యస్థానాలను కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రమాణాల భద్రతపై దృష్టి సారించి, ప్రయాణీకులకు సేవ చేయడానికి, మరిన్ని దేశీయ, అంతర్జాతీయ నగరాలను కనెక్ట్ చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ” అన్నారు. 


అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలు ఎన్నో హైదరాబాద్‌లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యల వల్ల హైదరాబాద్‌లోని అమెరికా ఆధారిత సంస్థల నుండి పెట్టుబడులు ఎన్నో రెట్లు పెరిగాయి, పెరుగుతున్నాయి. హైదరాబాద్ నుండి ఐటి ఎగుమతులకు అమెరికా మొదటి గమ్యస్థానం. హైదరాబాద్ నుండి మొత్తం ఐటి ఎగుమతుల్లో దాదాపు 70% అమెరికాకే జరుగుతున్నాయి.  హైదరాబాద్ నుండి అమెరికాకు సరాసరి కనెక్షన్ కావాలని ఎన్నేళ్లుగానో డిమాండ్ ఉంది. 

ఇప్పుడు ఎయిర్ ఇండియా నుంచి అమెరికాకు డైరెక్ట్ కనెక్షన్ ఈ ప్రాంతంలోని కార్పొరేట్ వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎయిర్ ఇండియా యొక్క ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ లకు మంచి సదుపాయాలను కోరుకునే ప్రయాణికులు ఎంతగానో ఆకట్టుకుంటాయి.  
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన తెలుగువాళ్ల సంఖ్య అమెరికాలో  వేగంగా పెరుగుతోంది. 

భారతదేశం నుండి చదువు కోసం విదేశాలకు వెళ్లే ప్రతి నలుగురు విద్యార్థులలో ఒకరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యపరంగా భారతదేశం రెండోస్థానంలో ఉంది. అమెరికా-ఇండియన్ విద్యార్థులలో, 50-65% మంది విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే.  

అలాగే, హైదరాబాద్‌ను ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, టీకా తయారీ కేంద్రమని పిలుస్తారు. ఇప్పుడు అమెరికాకు డైరెక్ట్ కనెక్షన్ వల్ల  ఎయిర్ కార్గోకు  ఫార్మా పరిశ్రమ నుంచి మంచి ఊతం లభిస్తుంది. హైదరాబాద్-అమెరికా మార్కెట్ విభాగంలో ప్రస్తుతం ఎయిర్ కార్గో 22,000 మెట్రిక్ టన్నులు ఉంది. ఇది ఏటా 8% పెరుగుతోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య కోవిడ్ వ్యాక్సిన్‌ను రవాణా చేయడానికి లాజిస్టిక్ సహాయాన్ని అందించడంలో ఈ సర్వీసు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందం  కింద, బ్రిటిష్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలు హైదరాబాద్‌ నుంచి యూకే, ఇతర చోట్లకు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి. కాగా ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా హైదరాబాద్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని వివిధ గమ్యస్థానాలతో కలుపుతూ తమ సేవలను తిరిగి ప్రారంభించాయి. ఖతార్ ఎయిర్‌వేస్ తో హైదరాబాద్‌, ఖతార్ రాజధాని నగరమైన దోహాతో తిరిగి కనెక్ట్ అయింది. 

ఎసిఐ ఎయిర్ పోర్ట్ హెల్త్ అక్రెడిటెడ్ అయిన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అన్ని అంతర్జాతీయ విమానాల ప్రయాణీకుల రాకపోకలను భద్రతా ప్రోటోకాల్ ప్రకారం పూర్తిగా పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్నారు. అన్ని ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యూయింగ్ ఏర్పాట్ల ద్వారా సామాజిక దూరం అమలు చేయడంతో పాటు టెర్మినల్స్‌లో తప్పనిసరి స్క్రీనింగ్, భద్రతా చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ నెలలో, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తాము సొంతంగా రూపొందించిన ఈ-బోర్డింగ్ సేవలను  అంతర్జాతీయ విమాన సర్వీసులకు విస్తరించి, భారతదేశంలో ఆ పని చేసిన మొట్టమొదటి విమానాశ్రయంగా నిలిచింది.

Follow Us:
Download App:
  • android
  • ios