తాను విఆర్ఎస్కు దరఖాస్తు చేశాననే ప్రచారంలో నిజం లేదని.. తప్పుడు ప్రచారం చేయద్దని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు.
కొత్త గూడెం : ‘నా ఉద్యోగానికి నేను రిజైన్ చేయబోతున్నానని, వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. నేను ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా మీకు తెలియజేస్తాను. కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయడానికి నా వంతు కృషి చేస్తున్నాను. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ గారు నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తున్నాను.
అందరూ కోరుకుంటున్నట్టుగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశిస్తే తప్పకుండా ఆయన ఆదేశాలని పాటిస్తాను. అప్పటివరకు దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ శ్రీనివాసరావు గడల అన్నారు.
డీహెచ్ శ్రీనివాసరావు తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ డిహెచ్ శ్రీనివాసరావు ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. ఈసారి ఎన్నికల్లో డిహెచ్ శ్రీనివాసరావు కొత్తగూడెం నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గతనెల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఆయన మీద జరుగుతున్న ప్రచారానికి ఊతం ఇచ్చినట్టుగా ఉన్నాయి. అంతేకాదు, ఆయన వ్యాఖ్యలు స్థానికంగా అధికార పార్టీలో చిచ్చుపెట్టాయి. పాల్వంచ మండలంలో పర్యటించిన డిహెచ్ శ్రీనివాసరావు కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వర్లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఆయనకు 80 ఏళ్లు అని.. దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని.. చాలా పెద్దవారు అయిపోయారని.. ఆయనకిక విశ్రాంతినిద్దాం అంటూ.. డిహెచ్ వ్యాఖ్యానించారు. తాను హాజరైన సభకు చాలా తక్కువ మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారని.. తను ప్రజల్ని కలిసేందుకు వచ్చానని.. మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగిగా.. ఉద్యోగులందరికీ 60 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ ఇచ్చేస్తారని.. మన స్థానిక ప్రజాప్రతినిధికి 80ఏళ్లని.. ఇప్పటికే ఆయన చాలా కాలం ప్రజాసేవ చేశారని చెప్పుకొచ్చారు.
ఆయన నియోజకవర్గానికి చాలా సేవ చేశారని…ఆయనకు కాస్త రెస్ట్ ఇద్దామని అన్నారు. గత ఎన్నికల్లో ఇవే తన చివరి ఎన్నికలని… ఒకసారి అవకాశం ఇవ్వమని అడిగారు. ఈసారి కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. ఎన్నిసార్లు అవకాశాలు ఇస్తాం. ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలి. గడల శ్రీనివాస్ కార్యక్రమానికి వస్తే అది కట్ చేస్తా, ఇది కట్ చేస్తా.. ఉన్న పదవి పీకేస్తా…దళిత బంధు రాకుండా చేస్తా.. ఇంకేదో స్కీం కట్ చేస్తా అనేది ఎంతకాలం నడుస్తుంది.. ఇంకా నాలుగు నెలలు మాత్రమే.
కేవలం నాలుగు నెలలు మాత్రమే. ఎందుకంటే ఈ మాటలు నేను బాధతో చెబుతున్నా.. నా మనుషులున్ని, నా కుటుంబ సభ్యుల్ని నా దగ్గరికి రాకుండా చేస్తున్నారనే బాధతో చెబుతున్నా.. అని చెప్పుకొచ్చారు. కొత్తగూడెంలోని ప్రతీ ఒక్కరినీ ఇలాగే బెదిరిస్తున్నాడు. ఇక్కడికి వచ్చినవారెవ్వరూ ఒక్క రూపాయి కూడా తీసుకుని వచ్చినవారు కాదు. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటా అని అన్నారు.
