ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ‌ఊరట లభించింది. ఆయనకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ‌ఊరట లభించింది. ఆయనకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తతుం బుచ్చిబాబు తీహార్ జైలులో ఉన్నారు. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బుచ్చిబాబు బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన విచారణ సందర్భంగా.. కేసు విచారణలో ఉన్నందున, నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు చేయరాదని సీబీఐ తన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ తరపున బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించి వాదనలు విన్న కోర్టు.. బెయిల్‌ పిటిషన్‌పై తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఈ రోజు బుచ్చిబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. 

ఇక, బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద  ఆడిటర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బుచ్చిబాబును సీబీఐ గత నెలలో అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి బుచ్చిబాబు సీబీఐ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇక, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కోర్టు అనుమతితో బుచ్చిబాబును ఈ కేసులో ప్రశ్నించింది.