తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌పై అవినీతి ఆరోపణలపై డిపార్ట్​మెంట్​ ఆఫ్​ పర్సనల్​ అండ్​ ట్రెయినింగ్ (డీవోపీటీ) వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌పై అవినీతి ఆరోపణలపై డిపార్ట్​మెంట్​ ఆఫ్​ పర్సనల్​ అండ్​ ట్రెయినింగ్ (డీవోపీటీ) వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్ కుమార్ కుమార్తె వివాహ వేడుకకు సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రజత్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని గవినోళ్ల శ్రీనివాస్ డీవోపీటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీవోపీటీ లేఖ పంపింది. 

అయితే డివోపీటీనే నేరుగా చర్యలు తీసుకోకుండా.. రజత్‌ కుమార్‌పై తాను చేసిన ఫిర్యాదును రాష్ట్రానికి పంపడంపై గవినోళ్ల శ్రీనివాస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రజత్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాలని గవినోళ్ల శ్రీనివాస్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు. శ్రీనివాస్ పిటిషన్‌పై జస్టిస్ యశ్వంత్ వర్మ ధర్మాసనం విచారణ జరిపింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్‌పై చీఫ్ సెక్రటరీ ఎలా చర్యలు తీసుకుంటారని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని డివోపీటికి నోటీసులు జారీచేసింది. విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది.