ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రభుత్వడిగ్రీ  కాలేజీలో మైనా  అనే విద్యార్ధిని ఆత్మహత్యకు  పాల్పడింది.  ర్యాగింగ్  వల్లే  ఆమె ఆత్మహత్య  చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు  ఆరోపిస్తున్నారు.

జడ్చర్ల: కాలేజీలో ర్యాగింగ్ కారణంగా డిగ్రీ కాలేజీ విద్యార్ధిని మైనా ఆత్మహత్యకు పాల్పడింది.మైనా ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని బాధిత విద్యార్ధిని పేరేంట్స్ ,విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై గురువారంనాడు డిగ్రీ కాలేజీ వద్ద పేరేంట్స్ ఆందోళనకు దిగారు.

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం హనుమాన్ తండాకు చెందిన మైనా అనే విద్యార్ధిని జడ్చర్ల కాలేజీలో డిగ్రీ చదువుతుంది.మైనాపై ఓ విద్యార్ధిని క్లాస్ రూమ్ లో దాడి చేసినట్టుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని మృతురాలి కుుటంబసభ్యులు చెబుతున్నారు.ఈ ఘటనతో మనోవేదనకు గురైన బాధితురాలు నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మైనా మృతదేహన్ని జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం కోసం తరలించారు. కాలేజీలో జరిగిన ఘటనలతో తాను పురుగుల మందు తాగినట్టుగా మైనా చెప్పిందని కుటుంబసభ్యులు మీడియాకు చెప్పారు. 

ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపాల్ చాంబర్ లో మృతురాలి కుటుంబసభ్యులు, విద్యార్ధి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కాలేజీలో మైనా అనే విద్యార్ధినిని తోటి విద్యార్ధినులు ర్యాగింగ్ చేశారని బాధిత కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.