టీకా కారణం కాదు,ఛాతీ నొప్పి కారణంగానే విఠల్ రావు మృతి: వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్
నిర్మల్ జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్ విఠల్ రావు మరణానికి ఛాతీ నొప్పే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్ విఠల్ రావు మరణానికి ఛాతీ నొప్పే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ నెల 19వ తేదీన కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ డ్రైవర్ విఠల్ రావు కరోనా టీకా తీసుకొన్నాడు. టీకా తీసుకొన్న తర్వాత ఆయన ఇంటికి చేరుకొన్నారు. ఇంటికి చేరుకొన్న విఠల్ రావు అస్వస్థతకు గురయ్యాడు.
అస్వస్థతకు గురైన విఠల్ రావు మరణానికి ఛాతీ నొప్పే కారణమని ప్రాథమిక పరీక్షల్లో తేలిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విఠల్ రావు మరణానికి టీకాకు సంబంధం లేదని ఆయన చెప్పారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే అసలు విషయం తేలుతుందన్నారు. జిల్లాలోని ఏఈఎఫ్ఐ కమిటీ పరిశీస్తోందని ఆయన చెప్పారు.కమిటీ తుది నివేదిక ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఇవాళ ఉదయం నిర్మల్ ఆసుపత్రిలో విఠల్ రావు మరణించాడు. కరోనా వ్యాక్సిన్ కారణంగానే విఠల్ రావు మరణించినట్టుగా ప్రచారం సాగడంతో నిపుణుల కమిటీ విచారణ చేయనున్నట్టుగా డైరెక్టర్ ప్రకటించారు.