చంద్రబాబుకు చెప్పా: అమరావతిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అమరావతిపై తెలంగాణ సిఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయప్రకాష్ నారాయణపై విరుచుకుపడ్డారు. అమరావతి కట్టవద్దని తాను చంద్రబాబుకు చెప్పానని, అయినా వినకుండా కట్టి వెల్లకిలా పడ్డారని కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణాన్ని డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గా ఆయన అభివర్ణించారు. అమరావతి నిర్మాణం వృధా అని తాను అప్పుడే చంద్రబాబుకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
ఎత్తిపోతలకు కరెంట్ బిల్లులపై ఆయన ఆదివారం శాసనసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిపై ఆ వ్యాఖ్యలు చేశారు. ఎత్తిపోతల కరెంట్ పై కొందరు ఎత్తిపొడిచారని, జయప్రకాశ్ నారాయణ... ఆయనెవరో తనకు అర్థం కాలేదని, ఆయనేదో పెద్ద కథ చేసి ప్రకటన ఇచ్చాడని, ఆయనకేం అవసరమని కేసీఆర్ అన్నారు.
ఔరోంకి షాదీమే అబ్దుల్లా బేగానా అన్నట్లు జయప్రకాష్ నారాయణది మన రాష్టం కాదు, మన్ను కాదని, అదంతా వేస్టని ఆయన అంటాడని, పక్క రాష్ట్రంలో రూ.53 వేల కోట్లతో అమరావతి కడుతుంటే దాన్ని డప్పు కొడతానంటాడని, డప్పు కొడతానంటాడని తెలంగాణ సిఎం అన్నారు. అది డెడ్ అన్వెస్ట్ మెంట్ కట్టవచ్చునా ఆయన అడిగారు.
చంద్రబాబు నాయుడికి కూడా చెప్పా.. కట్టకయ్యా వేస్ట్ అని, రాయలసీమకు నీళ్లు తీసుకుపో అని చెప్పానని ఆయన అన్నారు. అయినా చంద్రబాబు అమరావతి కట్టి వెల్లకిలా పడ్డాడని, పరిణామం ఏమిటో తెలిసిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.