Asianet News TeluguAsianet News Telugu

కుల రాజకీయాలు చేస్తే ముందు నువ్వే బలిపశువు...: రేవంత్ కు దానం హెచ్చరిక

రెడ్డిలకే రాజ్యాధికారం దక్కాలంటూ ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకులే కాదు ఇతర పార్టీ నాయకులు మండిపడుతున్నారు. 

danam nagender warning tp tpcc chief revanth reddy
Author
Hyderabad, First Published May 24, 2022, 4:15 PM IST

హైదరాబాద్: రెడ్డి సామాజికవర్గానికి సంబంధించి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. రెడ్డి సామాజికవర్గానిదే రాజ్యాధికారం కావాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్ నాయకులే కాదు సొంతపార్టీ నాయకులూ మండిపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (danam nagender) కూడా రేవంత్ పై విరుచుకుపడ్డారు. 

తెలంగాణలో కులాల రాజకీయం తేవాలని ప్రయత్నించడం సిగ్గు చేటని దానం అన్నారు. రేవంత్ మాటలు కాంగ్రెస్ పార్టీకి కూడా సిగ్గుచేటేనని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి మాటలపై ఆ పార్టీలోని మిగతా వర్గాలకు చెందిన నేతలు ఎందుకు పెదవి విప్పడం లేదు... ఏం ఆ నాయకుల నోళ్లు మూతపడ్డాయా లేక అమ్ముడుపోయారా? అంటూ దానం నిలదీసారు.

''సీఎం కేసీఆర్ (KCR) అన్ని వర్గాలను సమంగా చూస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర అభివృద్ధిని కూడా ఎక్కడా విస్మరించడం లేదు. ఇలాంటి సీఎం కేసీఆర్ ను మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం. మెజార్టీ ఉన్న కులాలను కాదని తన వర్గానికి సీఎం పదవి కావాలని రేవంత్ కలలు గంటున్నారు. ప్రగతిని చూడలేక కేవలం అధికార దాహంతోనే రేవంత్ కులం ప్రస్తావన తెచ్చారు. కళ్ళుండి కూడా చూడలేకపోతున్న వ్యక్తి రేవంత్. ఆయనకు అధికారం ఇక కల్లే..'' అని దానం అన్నారు.  

''తెలంగాణ వస్తే పరిస్థితి ఏమిటని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కొందరు ఆందోళనలు చెందారు. కానీ తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో మరెక్కడా జరగలేదు. అందరి అనుమానాలను సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారు. ఉమ్మడి ఏపీలో పదిహేడు మంది సీఎంలు ఉంటే ఒకే వర్గంవారు పన్నెండు మంది సీఎంలుగా పని చేశారు. ఎవ్వరు కూడా ఇంతలా అభివృద్ధి చేయలేకపోయారు. కేసీఆర్ లాంటి ఆలోచనలు వారికి ఎందుకు రాలేదు'' అని అడిగారు. 
 
''కుల రాజకీయం తెలంగాణలో నడవదు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదు. పెయిడ్ వర్కర్స్ ను తెచ్చి సభలు పెట్టుకునే సంస్కృతి రేవంత్ ది. మేము సభలు పెడితే అప్పటికప్పుడే జనాలు వస్తారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (KTR) వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం'' అని దానం అన్నారు. 

''కాంగ్రెస్ లో చేరినా రేవంత్ ఇంకా చంద్రబాబు ఏజెంట్ గానే పని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బీ టీం లాగా పీసీసీ పని చేస్తోంది. ఇప్పటికైనా రేవంత్ పిచ్చి మాటలు బంద్ చేయాలి.  ఆయన వాడే భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏం చేసినా మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. కుల రాజకీయం తెస్తే బలి పశువుగా మారేది రేవంతే'' అని దానం హెచ్చరించారు. 

''మా రాజ్యసభ అభ్యర్థి పార్థసారధి రెడ్డి పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన ఆరోపణలు ఖండిస్తున్నాం. పార్థసారధి రెడ్డి సేవా కార్యక్రమాలు చూసే కేసీఆర్ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. కరోనా సమయంలో ఎంతో మందికి ఉచితంగానే రెమిడెసివర్ పంపిణీ చేశారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని మందులు అమ్ముకున్నారని జగ్గారెడ్డి విమర్శించడం మంచిపద్దతి కాదు'' అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios