హైదరాబాద్ నుండి డిల్లీకి వెళుతున్న దక్షిణ్ ఎక్స్ ప్రెస్ అర్ధరాత్రి సమయంలో భువనగిరి జిల్లాలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగిన ప్రయాణికులు భయంతో పరుగుతీసారు.
హైదరాబాద్ : అర్థరాత్రి యాద్రాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి దేశ రాజధాని డిల్లీకి వెళుతున్న దక్షిణ్ ఎక్స్ ప్రెస్ లో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది వెంటనే రైలును నిలివేయగా భయబ్రాంతులకు గురయిన ప్రయాణికులు రైలు దిగి పట్టాలపైనే పరుగు తీసారు.
వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శనివారం రాత్రి దక్షిణ్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులతో డిల్లీకి బయలుదేరింది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రైలు ఘట్ కేసర్ - పగిడిపల్లి స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా చివరి బోగీలో మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటలను గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
వెంటనే రైల్వే అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వడంతో ఎనిమిది ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపుచేసారు. అలాగే అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సికింద్రాబాద్ నుండి ప్రత్యేక రైల్లో సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన బోగీ లగేజీ క్యారియర్ కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
దక్షిణ్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దక్షిణమధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అధికారులతో పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
