మా కుటుంబంపై ఎంపీ కవిత తప్పుడు ఆరోపణలు: అరవింద్ ఫైర్
ఎంపీ కవితపై డీఎస్ తనయుడు అరవింద్ విమర్శలు
నిజామాబాద్: తమ కుటుంబం గురించి ఎంపీ కవిత అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని ఎంపీ డీఎస్ తనయుడు అరవింద్ విమర్శించారు. కవిత చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంపై కవిత అర్ధరహితంగా మాట్లాడడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ళుగా నిజామాబాద్ అభివృద్ధి కోసం కవిత ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
నాలుగేళ్ళలో ఎంపీగా కవిత జిల్లా అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదని ఆయన విమర్శలు గుప్పించారు. విమర్శలు చేసే ముందు ముందు వెనుక ఆలోచించాలని ఆయన కవితకు సూచించారు.
డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా బుధవారం నాడు సీఎం కేసీఆర్ కు నాలుగు పేజీల లేఖను పంపారు.
డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని కూడ ఆరోపించారు. మరో వైపు తన కొడుకు కోసం టీఆర్ఎస్ ను బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని డీఎస్పై టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు.