రాయదుర్గంలో దోపీడీ: నేపాలీ గ్యాంగ్ అరెస్ట్, రూ. 5 లక్షలు స్వాధీనం
నగరంలోని రాయదుర్గం కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 5 లక్షల నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 5 లక్షల నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
ఈ నెల 6వ తేదీన మధుసూధన్ రెడ్డి కుటుంబసభ్యులకు ఇచ్చిన ఆహారంలో మత్తు మందు కలిపారు. కుటుంబసభ్యులు మత్తు మందు కలిపిన ఆహారం తిన్న కుటుంబసభ్యులు స్పృహ కోల్పోయారు. దీంతో ఈ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్ ఈ ఇంట్లో నుండి రూ. 15 లక్షల నగదు, బంగారాన్ని చోరీ చేశారు.
నేపాలీ గ్యాంగ్ వాచ్ మెన్ , పనిమనుషులుగా ఇంట్లో చేరారు. ఈ ఘటనలో పాల్గొన్నవారిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు.
కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా చేరిన ఈ గ్యాంగ్ సభ్యురాలు ఇంట్లో ఉన్నవారికి ఆహారం, టీలో మత్తు మందు ఇచ్చిందన్నారు. ఈ గ్యాంగ్ లీడర్ నేత్ర నేపాల్కి చెందిన వారందరినీ కూడగట్టుకొని దోపిడీ చేస్తున్నాడని సీపీ సజ్జనార్ తెలిపారు.
గతంలో బెంగుళూరు లో కూడా ఇలాగే దోపిడీ చేశాడని ఆయన గుర్తు చేశారు. రాబరీ చేశాక తలో దారిలో నేపాల్కి వెళ్లి అక్కడ డబ్బులు, నగలు పంచుకుంటారన్నారు. 10 టీమ్ ల ద్వారా ఈ గ్యాంగ్ ని పట్టుకున్నామన్నారు.
పరారీలో ఉన్నవారిని పట్టుకోవడానికి మరిన్ని టీమ్స్ రాజస్థాన్, ఢిల్లీలోకి వెళ్లాయని సీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ మెంబర్స్ని అరెస్ట్ చేయడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు పూర్తిగా సహకరించారన్నారు.ఎవరైనా కొత్తవాళ్లను పనిలో పెట్టుకోవాలంటే వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసుకోవాలని సీపీ సూచించారు.