ఆన్లైన్ డేటింగ్: హీరోయిన్ల ఫోటోలతో వల, చివరికిలా...
ఆన్లైన్ డేటింగ్ పేరుతో లక్షలాది రూపాయాలు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ఆన్లైన్ డేటింగ్ పేరుతో లక్షలాది రూపాయాలు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మంగళవారం నాడు వివరించారు.
ఆన్లైన్ డేటింగ్ పేరుతో సుమారు 150 మంది నుండి లక్షలాది రూపాయాలను వసూలు చసినట్టుగా పోలీసులు గుర్తించారు. అందమైన అమ్మాయిలు,హీరోయిన్ల ఫోటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టు ఆయన చెప్పారు.
ఈ వెబ్సైట్ ద్వారా డేటింగ్ కోసం ప్రయత్నించిన వారికి అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడించి.. డబ్బులు వసూలు చేశారు. సుమారు 150 మంది బాధితులు ఆన్లైన్ డేటింగ్ ముఠా సభ్యులు బాధితులుగా తేలారని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే ఓ బాధితుడి నుండి సుమారు రూ. 15 లక్షలను నిందితులు వసూలు చేశారు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్టుగా తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరిపి ముఠాను అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చని సజ్జనార్ చెప్పారు. బాధితుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఆయన ప్రకటించారు. ఈ ముఠా గుట్టురట్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను ఆయన అభినందించారు.