మిత్రుల నగ్నచిత్రాలు..ఫోటోలకు పూలదండలు.. వేధింపుల్లో రుణయాప్ ల క్రియేటివిటీ..!
లోన్ యాప్ ల వేధింపులకు ఎంతోమంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. లోను కట్టడం ఆలస్యం కావడంతో దారుణమైన రీతిలో వేధిస్తూ చివరికి ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి.
హైదరాబాద్ : రుణయాప్ ల వేదింపులు బాధితులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. మౌనంగా భరించలేక.. బయటకు చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నారు. పోలీసు కేసులు.. అరెస్టులు మమ్మల్ని ఏం చేయలేవు.. అంటూ నిర్వాహకులు అప్పులు తీసుకున్నవారికి సవాల్ విసురుతున్నారు. రుణాలు పొందిన వారికే కాదు.. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇంటా, బయటా పరువు తీసేందుకు.. ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదులు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
సూత్రధారులు పట్టుబడితే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు అనే అభిప్రాయం పోలీసు అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రుణ యాప్ ల వేధింపులపై ఆరు నెలల్లో సుమారు 150కి పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో అధిక శాతం నగర సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసినవే.
మార్ఫింగ్, బ్లాక్మెయిలింగ్…
నగరానికి చెందిన యువకుడు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకపోవడంతో నిర్వాహకులు నుంచి ఒత్తిడి మొదలైంది. అసలు, వడ్డీ చెల్లించేంత వరకు వదలం అంటూ వెంట పడ్డారు. అతను నుంచి స్పందన రాకపోవడంతో... బాధితుడి ఫోన్ లోని నెంబర్ ఆధారంగా అతడి మిత్రుల వాట్సాప్ డీపీ మంచి ఫోటోలు సేకరిస్తున్నారు. వాటిని నగ్న చిత్రాలుగా మార్కింగ్ చేసి.. వారికే పంపి మీ స్నేహితుడు అప్పు తీర్చుకుంటే ఇవన్నీ బయటకు పంపుతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు, ఎల్బీ నగర్ కోర్ట్ సంచలన తీర్పు
మగవాళ్ళు ఏదోవిధంగా ధైర్యంగా ఉన్నా.. మహిళలు, యువతులు స్నేహితుల జాబితాలో ఉన్నప్పుడు అడిగినంత సొమ్ము చెల్లించి పరువు కాపాడుకుంటున్నారు. రేతిబౌలికి చెందిన మహిళ ఇంటి అవసరాలకు అధిక వడ్డీకి పలు రుణయాప్ ల నుంచి రెండు లక్షలు తీసుకుంది. చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఆమె సహచర ఉద్యోగులకు ఫోన్ చేసి కించ పరిచారు. ఆమె ఫోన్ నెంబర్ ను 500 మంది యువకులకు ఇచ్చారు. వారి నుంచి అసభ్యంగా ఫోన్ రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మలక్పేట్ యువకుడు రూ.1.5 లక్షల అప్పు చెల్లించకపోవడంతో అతడు మరణించినట్లు శవానికి దండవేసి మార్ఫింగ్ ఫొటోను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫోన్ నెంబర్లకు వాట్సప్ ద్వారా చేరవేశారు.
కట్టడి చేసేదెలా..
రుణయాప్ ల వేధింపులను కట్టడి చేయడం పోలీసులకు సవాల్గా మారుతోంది. నగర సైబర్ క్రైమ్ పోలీసులు సుమారు 221 రుణయాప్ ల మీద గూగుల్ కు ఫిర్యాదు చేశారు. వీటిని ప్లేస్టోర్ నుంచి తొలగించమని కోరారు. దేశ, విదేశాలకు చెందిన 37 మందిని అరెస్ట్ చేశారు. ఇంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా కొత్త తరహాలో వేధింపులను తీవ్రం చేశారు అడగకుండా, దరఖాస్తు చేయకుండానే యాప్ ల నుంచి నగదు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని, అసలు, వడ్డీ చెల్లించమంటూ వేధిస్తున్నారని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.