తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ముగిసింది..: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటన
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ముగిసినట్లేనని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా సెకండ్ వేమ్ ముగిసినట్లేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికయితే కరోనా కంట్రోల్ లో వుందని... ప్రస్తుతం అతి తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు సీజనల్ వ్యాధులు పెరిగిపోయాయి... కాబట్టి జ్వరం, జలుబు రాగానే కరోనాగా నిర్దారణకు రావద్దని సూచించారు. ఎలాంటి అనారోగ్యం వున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని... తగిన టెస్టుల తర్వాతే రోగమేంటో నిర్దారణ అవుతుందన్నారు.
ఇదిలావుంటే రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని... ఇప్పటికే 1.65కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో 56శాతం మంది ఫస్ట్ డోస్, 34శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినట్లు తెలిపారు రాజధాని హైదరాబాద్ లో అయితే 100శాతం మందికి, జిహెచ్ఎంసి పరిధిలో 90శాతం మందికి కనీసం ఒక డోస్ అయినా పూర్తయిందని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించారు.
read more గాంధీలో గ్యాంగ్ రేప్: కన్పించకుండా పోయిన మహిళ కోసం ఆసుపత్రిలో గాలింపు
ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం తెలంగాణ వైద్యారోగ్య విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 417 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,53,202కి చేరుకొంది.
24 గంటల్లో 87,230 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 417 మందికి కరోనా సోకిందని తేలిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 3,847 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,939కి చేరింది.
రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు 98.34 శాతంగా ఉంది. కరోనాతో మరణించిన వారి రేటు 0.58 శాతంగా నమోదైందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది. గత 24 గంటల్లో 569 మంది కరోనా నుండి కోలుకొన్నారు.
ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 6,42,416కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థల రీ ఓపెనింగ్ కు కూడ వైద్య ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 8వ తరగతి నుండి పీజీ వరకు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు విద్యాశాఖ సన్నాహలను మొదలు పెట్టింది.