సంగీత భర్తకు మియాపూర్ కోర్టు మొట్టికాయలు
- సంగీతకు అనుకూలంగా కోర్టు తీర్పు
- ఆమెను ఇంట్లోకి అనుమతించాలని తీర్పు
ఎట్టకేలకు సంగీతకు న్యాయం లభించింది. గత 54 రోజులుగా దీక్ష చేస్తున్న సంగీతకు అనుకూలంగా తీర్పునిచ్చింది మియాపూర్ ఫ్యామిలీ కోర్టు. భర్త శ్రీ నివాస్ రెడ్డి, అతడి తల్లిదండ్రులు సంగీత, ఆమె కూతురి మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.20 వేలు ఇవ్వాలని తీర్పునిచ్చింది. అతాగే ఆమెను ఇంట్లోకి అనుమతించాలని, ఎలాంటి వేధింపులకు గురిచేయరాదని భర్తకు, అత్తామామలకు సూచించింది.
ఈ సంగీతకు జరిగిన అన్యాయం ఏమిటో మరోసారి తెలుసుకుందాం. ఆడ పిల్లను కన్నందుకు భార్య సంగీత ను కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు బోడుప్పల్ కు చెందిన టీఆర్ఎస్ యాత్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి. దీనికి అతడి కుటుంబసభ్యులందరు మద్దతిచ్చారు. దీంతో సంగీత ఇదేమిటని భర్త, అత్తామామలను ప్రశ్నించగా భర్తతో పాటు అత్తామామలు చితకబాదిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం ఈ విషయం బైటకు వచ్చింది. దీంతో పోలీసులు శ్రీనివాస రెడ్డి అతడి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. అలాగే సంగీతకు స్థానికులు, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు అండగా నిలిబడ్డారు. వీరి సహకారంతో సంగీత తన భర్త ఇంటి ఎదుట దీక్షకు దిగింది. దీంతో పలువురు రాజకీయ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు భర్తకు, సంగీతకు మత్య మద్యవర్తిత్వం వహించి దీక్షను విరమింపచేయాలని చూశారు. అయినా అవేవి పలించక సంగీత గత 54 రోజులుగా దీక్ష చేపడుతూనే ఉంది.
ఈ దీక్షను ఇటీవల రెండు రోజుల క్రితం విరమించింది సంగీత. అయితే శ్రీనివాస రెడ్డి కూడా జైలు నుండి బెయిల్ పై విడుదలయ్యాడు. కానీ అతడిపై కోర్టులో కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా ఇవాళ మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీతకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును తాము స్వీకరించమని, ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు శ్రీనివాస్రెడ్డి తెలిపాడు.