గృహ హింస కేసులో పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కుటుంబానికి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడల్ని ఇంట్లోకి అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుల్లారెడ్డి స్వీట్స్ యజమానికి కుటుంబానికి న్యాయస్థానం షాకిచ్చింది. పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడల్ని ఇంట్లోకి అనుమతించాలని ఆయనను ఆదేశించింది. గతంలో కోడల్ని ఇంట్లో పెట్టి రాత్రికి రాత్రే గోడకట్టారు రాఘవరెడ్డి. ఇంట్లో నుంచి ఎలాగోలా బయటపడ్డ కోడలు.. కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రాఘవరెడ్డి కోడలికి తగిన రక్షణ కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
కాగా.. గత కొంతకాలంగా రాఘవరెడ్డి కుమారుడు ఏక్నాథ్ రెడ్డి- ప్రజ్ఞా రెడ్డి దంపతుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. భార్యను ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఏక్నాథ్ అడ్డుకున్నారు. వారుంటున్న భవనంలోని పైఅంతస్తు నుంచి తన భార్య కిందకు రాకుండా బంధించాలని ఏక్నాథ్ రెడ్డి తలచాడు. రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడను నిర్మించాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.
ALso Read:కోర్టుకు చేరిన పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కుటుంబ వివాదం.. న్యాయస్థానం కీలక ఆదేశాలు
దీంతో ఏక్నాథ్ భార్య డయల్ 100కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. దీంతో స్పందించిన పంజాగుట్ట పోలీసులు.. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను రక్షించారు. ఏక్ నాథ్ తండ్రి రాఘవరెడ్డి.. పుల్లా రెడ్డి గ్రూప్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రజ్ఞారెడ్డి తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. 2014లో ఏక్నాథ్ వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది.
