తెలంగాణ కాంగ్రెస్ నేతలు పి.బలరాంనాయక్‌, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిపై ప్రజాప్రతినిధుల కోర్ట్ నాన్‌ బెయిలబుల్ వారెంట్‌ జారీ చేసింది.  అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కాగానే బలరాం నాయక్ కోర్టు ఎదుట హాజరయ్యారు. దీంతో బలరాం నాయక్‌పై జారీ చేసిన వారెంట్‌ను కోర్టు ఉపసంహరించుకుంది

తెలంగాణలో ముగ్గురు కాంగ్రెస్‌ పార్టీ నేతలపై ప్రజాప్రతినిధుల కోర్ట్ నాన్‌ బెయిలబుల్ వారెంట్‌ జారీ చేసింది. కాంగ్రెస్‌ నేతలు పి.బలరాంనాయక్‌, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిపై కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. హన్మకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించారని 2018లో వీరిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశించినప్పటికీ విచారణకు హాజరు కానందున ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం వారిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ముగ్గురు నేతలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీస్‌ శాఖను ఆదేశించింది. అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కాగానే బలరాం నాయక్ కోర్టు ఎదుట హాజరయ్యారు. దీంతో బలరాం నాయక్‌పై జారీ చేసిన వారెంట్‌ను కోర్టు ఉపసంహరించుకుంది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 3న విచారణకు హాజరు కావాలని అక్బరుద్దీన్‌ను ఆదేశించింది. నిర్మల్‌లో నిర్వహించిన సభలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారని అక్బర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

ఇక బూర్గంపహాడ్‌లో ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. అలాగే ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాఖలైన కేసునూ కోర్టు కొట్టివేసింది. వేర్వేరు కేసుల్లో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, జాఫర్‌ హుస్సేన్‌ విచారణకు హాజరయ్యారు.