వైఎస్ విజయలక్ష్మి, షర్మిలకు కోర్టు సమన్లు: కారణమిదీ....
వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మకు, సోదరి షర్మిలకు కోర్టు సమన్లు జారీ చేసింది. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 10వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మికి, సోదరి షర్మిలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 10వ తేీదన తమ ముందు హాజరు కావాలని ప్రత్యేక కోర్టు ఆ సమన్లు జారీ చేసింది. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ చేసింది.
ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ 2012లో పరకాల పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
ఇదిలావుంటే, ఆస్తుల కేసులో వైఎస్ జగన్ కూడా అదే రోజు కోర్టుకు హాజరు కానున్నారు. జగన్ గైర్హాజరుపై సీబీఐ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు.
హాజరు నుంచి జగన్ ను మినహాయించాలని మరోసారి ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పదే పదే మినహాయింపు కోరడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు.
జగన్ కు ఇప్పటి వరకు 10 సార్లు మినహాయింపు ఇచ్చామని కోర్టు తెలిపింది. ఈ నెల 10వ తేదీన హాజరు కావాల్సిందేనని చెప్పారు.