టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులు సాయి లౌకిక్, సాయి సుస్మితలకు బెయిల్ నిరాకరించింది కోర్ట్.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులు సాయి లౌకిక్, సాయి సుస్మితలకు బెయిల్ నిరాకరించింది కోర్ట్. అంతకుముందు ఈరోజు ఉదయం కూడా ఈ కేసులో కీలకంగా వున్న రాజశేఖర్ రెడ్డి, ఏ 19, ఏ 20, ఏ 21లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కూడా న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే.
కాగా.. పేపర్ లీక్ కేసులో మంగళవారం సిట్ మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. వీరిని క్రాంతి, శశిధర్ రెడ్డి, రవితేజలుగా తెలిపారు. డీఏవో పేపర్ను సాయి లౌకిక్ వద్ద రవితేజ కొనుగోలు చేయగా.. అదే పేపర్ను మురళీధర్ నుంచి క్రాంతి, శశిధర్ రెడ్డిలు కొన్నట్లుగా సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో వీరు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది సిట్.
ALso Read: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్, రిమాండ్కు తరలింపు
ఇదిలావుండగా.. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు బెయిల్ మంజూరు చేసినవారిలో నీలేష్ నాయక్, కేతావత్ శ్రీనివాస్, రాజేందర్ నాయక్, షమీమ్, సురేశ్ మరో ముగ్గురు ఉన్నారు. రూ. 50 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిట్ విచారణకు సహకరించాలని ఆదేశించింది. నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే నాంపల్లి కోర్టు ఈ కేసులో రేణుకాకు, మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఇక, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఐదుగురు నిందితులు రేణుక , రాజేశ్వర్, ఢాక్యానాయక్, గోపాల్, నీలేష్లను కస్టడీకి ఇవ్వాలని ఈడీ శుక్రవారంనాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు హైద్రాబాద్ ఎంఎస్జే కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ నేపథ్యంలో నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితుల తరపు న్యాయవాదులు ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే గతంలో వీరిని కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
