పిల్లలు పుట్టడం లేదన్న మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో విషాదం...
పెళ్లై చాలా ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడంలేదన్న మనస్థాపంతో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. మొదట భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా ఆ తర్వాత భర్త ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం తెక్కలవాడి గ్రామానికి చెందిన కుమార్రెడ్డికి, నాగలక్ష్మితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వీరికి పిల్లలు మాత్రం కలుగలేదు. దీంతో వీరు ఎప్పుడూ పిల్లలగురించి బాధపడుతుండేవారు.
ఈ క్రమంలో భార్య నాగలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను బళ్ళారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
భార్య ఆత్మహత్య చేసుకోవడంతో తాను కూడా బ్రతికి లాభం లేదని భావించిన కుమార్ రెడ్డి గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని చెట్టు నుండి కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఇలా పిల్లల కోసం భార్యాభర్తలు ఆత్మహత్య కు పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుమున్నాయి. ఒకే సారి ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.