Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్: తెలంగాణలో 563కు చేరిన కేసులు, మృతులు 17 మంది

తెలంగాణలో తాజాగా 32 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరొకరు కోవిడ్ -19తో మరణించారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 563కు చేరుకోగా, మృతుల సంఖ్య 17కు చేరుకుంది.

Coronavirus: 32 fresh cases, one more death recorded in Telangana
Author
Hyderabad, First Published Apr 13, 2020, 6:24 PM IST

హైదరాబాద్: తెలంగాణ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొత్త కేసులు వచ్చి పడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారంనాడు మరో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 563కు చేరుకుంది. 

కరోనా వైరస్ తో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో తెలంగాణలో కోవిడ్ -19 మృతుల సంఖ్య 17కు చేరుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం పరిస్థితిని సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని కేసీఆర్ అన్నారు. 

హైదరాబాదును 17 యూనిట్లుగా విభజించాలని ఆయన సూచించారు. ఒక్కో యూనిట్ గా రెవెన్యూ, మున్సిపల్, వైద్య, రెవెన్యూ అధికారులను నియమించాలని ఆయన సూచించారు. జోన్లుగా విభజించి ప్రత్యేకాధికారని నియమించాలని ఆయన సూచించారు. 

కంటైన్మెంట్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇళ్లలోంచి ప్రజలెవరూ బయకు రావద్దని సూచించారు. రోజుకు 1000 నుంచి 1100 మందికి పరీక్షలు నిర్వహించే విధంగా ల్యాబ్ లు ఉండాలని చెప్పారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటన్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్ డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను సిఎం సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. 

‘‘పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దు. ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్ లోనే జిహెచ్ఎంసిలోని సర్కిళ్ల వారీగా ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios