పనిచ్చి.. పాడుచేశాడు: మహిళా కూలీపై కాంట్రాక్టర్ అత్యాచారం
గుక్కెడు గంజి దొరుకుతుందని ఏదైనా పని ఇప్పించమని ఓ మహిళా కూలీ ఓ కాంట్రాక్టర్ను ఆశ్రయించింది. ఆమె కష్టం చూసి అతను కూడా పని ఇచ్చాడు. దేవుడని సంబరపడేలోపు అతనిలోని కామాంధుడు బయటకొచ్చాడు
గుక్కెడు గంజి దొరుకుతుందని ఏదైనా పని ఇప్పించమని ఓ మహిళా కూలీ ఓ కాంట్రాక్టర్ను ఆశ్రయించింది. ఆమె కష్టం చూసి అతను కూడా పని ఇచ్చాడు. దేవుడని సంబరపడేలోపు అతనిలోని కామాంధుడు బయటకొచ్చాడు. ఆ మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం కలిగించింది.
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ 26 ఏళ్ల మహిళ బతుకు తెరువు కోసం భర్త, తన నాలుగేళ్ల కూతురితో కలిసి హైదరాబాద్కు వలస వచ్చి షేక్పేటలో నివాసం ఉంటోంది. దినసరి కూలీగా పనిచేస్తున్న ఆమె మూడు రోజుల క్రితం పని కోసం రవి అనే లేబర్ కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్లింది.
పని గురించి అడగ్గా... ఆమెను కొత్తగా నిర్మిస్తున్న భవనం వద్దకు తీసుకెళ్లి ఇక్కడ పని చేసుకోమ్మని చెప్పాడు. అదే రోజు సాయంత్రం మహిళ వద్దకు వెళ్లిన రవి ఆమెను బలవంతంగా ఆ భవంతి పై అంతస్తుకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తన మనసులోనే దాచుకున్న మహిళ... ఆదివారం జరిగిన దారుణాన్ని భర్తకు తెలియజేసింది. అనంతరం భర్తతో కలిసి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రవిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.