రాయలసీమ ఎత్తిపోతల: మీరే రంగంలో దిగండి.. ఎన్జీటీలో తెలంగాణ సర్కార్ ధిక్కరణ పిటిషన్
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో సోమవారం ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ అంశం తమ దృష్టిలో ఉందని, జాబితా ప్రకారం ఈ నెల 23న విచారణ జరుపుతామని ఎన్జీటీ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సర్కార్.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)లో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) రామచంద్రరావు దీనిపై వాదించారు. గతంలో రాయలసీమ ఎత్తిపోతలపై గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్పై విచారణను ఎన్జీటీ ఇవాళ్టికి వాయిదా వేసింది. కానీ, ఇవాళ విచారణకు రాకపోవడంతో తాము కూడా ధిక్కరణ పిటిషన్ వేశామని ఏఏజీ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు.
Also Read:ఇరకాటంలో జగన్... రాయలసీమ ఎత్తిపోతలపై స్వరాష్ట్రంలోనూ వ్యతిరేకత
గత ఎన్జీటీ ఆదేశాల ప్రకారం కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి నేడు నివేదిక సమర్పించాల్సి ఉందని ఏఏజీ వివరించారు. కానీ ఏపీ ప్రభుత్వం.. తనిఖీ చేయకుండా అధికారులను అడ్డుకోవడంతో ఇంతవరకు ఆ విభాగాలు నివేదిక ఇవ్వలేదని రామచంద్రరావు ఎన్జీటీకి తెలిపారు. స్వయంగా ఎన్జీటీనే రంగంలోకి దికి ప్రాజెక్టును తనిఖీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్తో పాటు తెలంగాణ ప్రభుత్వం వేసిన ధిక్కరణ పిటిషన్ను జతచేసి విచారణ చేపట్టాలని ఏఏజీ కోరారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం తమ దృష్టిలో ఉందని, జాబితా ప్రకారం ఈ నెల 23న విచారణ జరుపుతామని ఎన్జీటీ పేర్కొంది.