ఈ నెల  9వ తేదీన  కరీంనగర్ లో  కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు  చేయనుంది.  ఈ సభలో  ఛత్తీస్ ఘడ్  సీఎం పాల్గొంటారు.  

కరీంనగర్: ఈ నెల 9వ తేదీన కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. ఈ సభకు ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ హజరు కానున్నారు,.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న పథకాల విషయమై కాంగ్రెస్ నేతలు ఈ సభ ద్వారా ప్రకటన చేసే అవకాశం ఉంది. 

హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. రేవత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో సాగుతుంది. ఈ నెల 9వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి పాదయాత్ర కరీంనగర్ నియోజకవర్గానికి చేరుకోనుంది. అదే రోజున సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

గత నెల 6వ తేదీన రేవంత్ రెడ్డి మేడారంలో పాదయాత్రను ప్రారంభించారు. తొలి విడత 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. 60 రోజుల పాటు రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగుతుంది. 

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి కూడా పాదయాత్రను ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి హైద్రాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్రలు నిర్వహించనున్నారు.