తెలంగాణాలో బిజెపి, కాంగ్రెస్ భాయీ ... భాయీ
బిజెపి శాసన సభ్యల సస్పెన్షన్ కు నిరసనగాఅసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్...
ఉత్తర ప్రదేశ్ లో కొట్లాడితే నేముంది, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బురదచల్లుకుంటే నేం, తెలంగాణాలో మాత్రం బిజెపి... కాంగ్రెస్ నేతలు భాయీ భాయి అనుకుంటున్నారు. బిజెపి హక్కులను అధికార పార్టీ టిఆర్ ఎస్ కాలరాస్తున్నదని కాంగ్రెస్ అందోళన వ్యక్తంచేస్తున్నది. అంతేకాదు,బిజెపికి మద్దతుగా కాంగ్రెస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
బహుశా ఇలా రెండు జాతీయ పార్టీలయిన బిజెపి- కాంగ్రెస్ కలసి ప్రజాస్వామ్యం కోసం ప్రాంతీయ రూలింగ్ పార్టీ తో తలపడటం ఇదే ప్రథమం కావచ్చు.
ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో బిజెసి సభా పక్ష నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ తో పాటు చింతల రామచంద్రారెడ్డి, జి కిషన్ రెడ్డి, రాజా సింగ్, ఎన్వీఎస్ ప్రభాకర్ లను స్పీకర్ సస్పెండ్ చేశారు.
మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ బిజెపి సభ్యులు స్పీకర్ పోడియం వద్ద దూసుకెళ్లారు. నిరసన చేపట్టారు.
దీనిపై మంత్రి హరీష్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. బయట ధర్నా కార్యక్రమం ఏర్పాటుచేసుకుని కేవలం స్పెండ్ అయి, పబ్లిసిటి కోసం బిజెపి సభ్యులు సభకు వచ్చి అంతరాయం కల్గిస్తున్నారని ఆయన ఆరోపించారు.
బిజెపి సభ్యులను సస్పెండ్ చేయాలని ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ వారిని సభ నుంచి రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
అయితే, బీజేపీ సభ్యుల సస్పెన్షన్ను కాంగ్రెస్ నిరసించింది. ఇది తప్పని చెబుతూ సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. బీజేపీ శాసన సభ్యులను సస్పెన్షన్పై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాక మీడియాతో మాట్లాడుతూ నిరసన చెప్పడం నిషేధమా అని ఆశ్చర్య పోయారు. నిరసన గొంతులను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందన్నివిమర్శించారు.
ప్రజాస్వామిక హక్కయిన నిరసన కోసం ఏర్పాటుచేసిన ధర్నాచౌక్ ను ఎత్తేయకుండా కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగదా అని జానా అన్నారు.
బీజేపీ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష నేత డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నం మంచిదికాదు, ఈ దోరణి మానుకోవాలని ఆయన సూచించారు.