ఈటలకు మరింత మద్దతు... బిజెపిలో చేరిన సర్పంచ్, వార్డ్ మెంబర్స్
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక తర్వాత కూడా కాాంగ్రెస్ నుండి వలసలు ఆగడం లేదు. హుజురాాబాద్ ఉపఎన్నిక సమయంలో కిందిస్థాయి నాయకులు పార్టీని వీడుతున్నారు.
కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో హుజురాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఈటల రాజీనామాతో హుజురాబాద్ లో ఉపఎన్నిక ఖాయం కావడంతో అటు అధికార టీఆర్ఎస్, ఇటు బిజెపి అప్పుడే రంగంలోకి దిగాయి. అయితే తెలంగాణ పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమితులైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా హుజురాబాద్ లో దూకుడు పెంచనుందని అందరూ భావించారు. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ షాక్ తగిలింది.
ఈటల చేరికతో బలంగా మారిన బిజెపిలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు బిజెపిలో చేరారు. ఈటల రాజేందర్ ను గెలుపించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే బిజెపిలో చేరినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
read more టీఆర్ఎస్లో చేరకుంటే పాత కేసులు బయటకు తీస్తున్నారు: పోలీసులపై ఈటల ఆరోపణలు
ఇదిలావుంటే తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుపై మాజీ మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు హరీశ్ రావు విందులు ఏర్పాటు చేస్తున్నాడని... డబ్బులు ఇస్తున్నాడని ఈటల ఆరోపించారు. పార్టీ పెద్దల మెప్పు పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. త్వరలో హరీశ్ రావుకు కూడా తనకు పట్టిన గతే పడుతుందని రాజేందర్ హెచ్చరించారు. హుజూరాబాద్లో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
మీ పార్టీ నుంచి గెలిచానని అన్నారుగా... అందుకే రాజీనామా చేశానని రాజేందర్ స్పష్టం చేశారు. డబ్బు, ఇతర ప్రలోభాలను పాతరేసే సత్తా హుజూరాబాద్ ప్రజలకు ఉందని ఈటల స్పష్టం చేశారు. తమతో తిరిగే యువకులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని రాజేందర్ ఆరోపించారు. సీఎస్, డీజీపీ చట్టానికి లోబడి పనిచేయాలని, కొందరికి చుట్టంగా కాదంటూ ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు.