తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనపై దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనపై దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే పలుచోట్ల కాంగ్రెస్ ముఖ్య నాయకులను పోలీసు హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ చాలా చోట్ల కాంగ్రెస్ శ్రేణులు దశాబ్ది దగా పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్లో గాంధీ భవన్ వద్ద కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. హన్మకొండలో మాత్రం కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఓవైపు మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి దశాబ్ది దగా పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగింది.
జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దశాబ్ది దగా నిరసనల్లో భాగంగా హన్మకొండ ఎమ్మార్వో ఆఫీస్ ముందట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజాధనాన్ని వృధా చేయడంపై ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరు మీద విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వృధా చేస్తూ తమ సొంత ప్రచారాల కోసం వాడుకుంటుందని జంగా రాఘవరెడ్డి ఆరోపించారు.
మరోవైపు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపై వంటావార్పు నిర్వహించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలను విజయంతం చేశామని నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. తాను జిల్లా అధ్యక్షుడినని.. పార్టీ ఆదేశాల మేరకు తాను నిరసన కార్యక్రమాలు నిర్వహించానని తెలిపారు. అధిష్టానం సూచనల మేరకు నడుచుకోవాలని.. కోవర్టు వ్యవహారాలు పార్టీలో నడిచే ప్రసక్తే లేదనే అన్నారు. ఇక, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్లో జంగా వర్సెస్ నాయిని పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
