తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: న్యాయ పోరాటానికి కాంగ్రెస్
ఓటమిలో అనుమానాలుంటే న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు.ఈ విషయమై న్యాయ నిపుణులతో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్సిస్తున్నారు
హైదరాబాద్: ఓటమిలో అనుమానాలుంటే న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు.ఈ విషయమై న్యాయ నిపుణులతో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్సిస్తున్నారు. ముఖ్యంగా 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా తేరుకోలేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా సోమవారం నాడు అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ ముఖ్యులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. తక్కువ ఓట్లతో ఓటమి పాలైన అభ్యర్థులు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు కౌంటింగ్ అయిన ఓట్లకు మధ్య కూడ తీవ్ర వ్యత్యాసం ఉంది. ఈ విషయమై కూడ న్యాయ నిపుణులతో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు.
తెలంగాణలో ఎన్నికల విషయమై ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో కోర్టుకు వెళ్లేందుకు అవసరమైన ఆధారాలను కూడ కొందరు నేతలు ఈ సమావేశంలో కుంతియాకు చూపారు.
ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితంపై కోర్టును ఆశ్రయించారు. ఇదే తరహాలో మిగిలిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ కాంగ్రెస్ నేతలు కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నారు.
ఈ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు కౌంట్ చేసిన ఓట్లకు మధ్య ఎందుకు తేడా ఉందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయాలన్నింటిపై ఆధారాలతో సహా కోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తెలంగాణలో ఓటమిపై పార్టీ నేతలతో కుంతియా సమీక్ష