కేసీఆర్ ఎఫెక్ట్: వారంలో 50 మంది అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శుక్రవారం నాడు హైద్రాబాద్లో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శుక్రవారం నాడు హైద్రాబాద్లో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.వారం రోజుల్లోపుగా సుమారు 50 మంది అభ్యర్థుల జాబితాను కూడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ అసెంబ్లీని రద్దు చూస్తే కేసీఆర్ గురువారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో మునిగిపోయాయి.ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా శుక్రవారం నాడు సమావేశం కానున్నారు.
తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది.
టీడీపీతో పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ముగ్గురితో కమిటీని కూడ ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి, బోస్రాజు, మధు యాష్కీలు టీడీపీతో చర్చించనున్నారు. ఈ పొత్తుల విషయం ఫైనల్ అయితే పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
అయితే పొత్తులకు సంబంధం లేని.. ఎలాంటి వివాదాలు లేని స్థానాల్లో అభ్యర్థులను వెంటనే ప్రకటించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ మేరకు సుమారు 50 స్థానాల్లో అభ్యర్థులను వారం రోజుల్లో ప్రకటించేలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇతర పార్టీల్లోని అసంతృప్తులను మాజీలను కూడ పార్టీలో చేర్చుకొనేందుకు కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.