సారాంశం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు వేస్తామన్నారు ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .  అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను నెరవేర్చుతామని.. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు వేస్తామన్నారు ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బుధవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 1 పరీక్షను నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పరీక్షలను సమర్ధంగా నిర్వహించలేని అసమర్ధ ప్రభుత్వమన్నారు.

టీఆర్టీ ద్వారా 70 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను నెరవేర్చుతామని.. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు పలికిందని.. 66 మంది బీజేపీ ఎంపీలు ఓటింగ్‌కు హాజరుకాలేదని వెంకట్ రెడ్డి వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మాది అని సోనియా స్పష్టంగా చెప్పినప్పటికీ.. తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: ఇక నుండి వార్ రూమ్ నుండే వ్యూహాలు అమలు:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దూకుడు

కాగా.. తెలంగాణలోని 119 స్థానాల్లో బీసీ అభ్యర్థులకు 34కు పైగా సీట్లు ఇవ్వాలని వెనుకబడిన తరగతులకు (బీసీ వ‌ర్గం) చెందిన కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. బీసీల‌కు టికెట్ కేటాయింపుల‌పై రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ బీసీ నేతలు రాహుల్ సహా ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు. తాజాగా ప‌ల‌వురు బీసీ నేత‌లు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వ‌చ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి మహబూబ్‌నగర్‌లో బీసీలకే టిక్కెట్ ఇవ్వాల‌ని కోరారు.

వివ‌రాల్లోకెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ బీసీ నేతలకే ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్ బీసీ నాయకులు ఎన్పీ వెంకటేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్యాదవ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా మొత్తం జనాభాలో బీసీలు 60 శాతం ఉన్నందున అసెంబ్లీ టికెట్ బీసీ నేతకు మాత్రమే ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడికి విన్నవించారు.