టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేది లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి తాను వెళ్లలేదని.. దానితో తనకు సంబంధం లేదన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి. మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి తాను వెళ్లలేదని.. దానితో తనకు సంబంధం లేదన్నారు. అందువల్ల ఈటల, రేవంత్ ఎపిసోడ్‌పై మాట్లాడటానికి ఏం లేదన్నారు కోమటిరెడ్డి. ఛత్తీస్‌గఢ్‌లో దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం రూ.3 వేలకు కొనుగోలు చేస్తోందన్న ఆయన.. తాను చెప్పేది అబద్ధమైతే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అప్పుడు అన్ని వర్గాలను ఆదుకుంటామని వెంకట్ రెడ్డి తెలిపారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read: కాంగ్రెస్-బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్

అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈటల నిన్నటి దాకా వున్న భూస్వాముల పార్టీ మాది కాదంటూ చురకలంటించారు. కాంగ్రెస్‌పై పడి ఏడవటం దేనికని భట్టి దుయ్యబట్టారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వుండకూడదని బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని సీఎల్పీ నేత ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధ్వంసం, దోపిడీలోనూ ఈటల భాగమేనని విక్రమార్క అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎజెండాలో భాగంగానే ఈటల మునుగోడు ఉపఎన్నిక విషయాన్ని ప్రస్తావించారని ఆయన ఆరోపించారు.

ఇకపోతే.. శనివారంనాడు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో తాను ఏ రాజకీయ నేత గురించి మాట్లాడలేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తాను రేవంత్ రెడ్డి పేరే ప్రస్తావించలేదన్నారు. కానీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ తన గురించి అసభ్యంగా మాట్లాడారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. 

తెలంగాణ ఉద్యమంలో తాను నిత్యం ఉద్యమం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. కానీ ఆ సమయంలో రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని తిరిగాడని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి తనకు పోలిక ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చాడన్నారు. తాను విద్యార్ధిగా ఉన్న సమయంలోనే జైలుకు వెళ్లివచ్చినట్టుగా ఈటల రాజేందర్ గుర్తు చేశారు. విద్యార్ధి సమస్యలపై తాను పోరాటాలు చేసినట్టుగా ఈటల రాజేందర్ చెప్పారు. ప్రజల కోసం పోరాడి రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లలేదన్నారు.