అభ్యర్ధుల ఎంపిక, సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే బీసీలకు నల్గొండ వదిలేస్తామన్నారు. డిక్లరేషన్ అమలు చేస్తామని.. లేకుంటే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు టికెట్లు బలహీన వర్గాలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అవసరం అనుకుంటే బీసీలకు నల్గొండ వదిలేస్తామన్నారు. బీసీ అభ్యర్ధుల షార్ట్ లిస్ట్ చేయొద్దని పీఈసీలో చెప్పానని అన్నారు కోమటిరెడ్డి. పీఈసీలో మెంబర్స్ , స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యి చర్చించాలని సూచించామన్నారు. డిక్లరేషన్ అమలు చేస్తామని.. లేకుంటే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోమటిరెడ్డి చెప్పారు. మూడెకరాలిస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పాని ఆయన దుయ్యబట్టారు. మాట తప్పితే తల నరుక్కుంటానని అన్నారని.. కేసీఆర్ ఏం చేశారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
అంతకుముందు గత శనివారం కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను వీడిన వేముల వీరేశం కాంగ్రెస్లో చేరతారనే ఊహాగానాల నేపథ్యంలో శనివారం నకరేకల్లో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరో వస్తున్నారనే వార్తలు నమ్మి కార్యకర్తలు అనవసరంగా ఆవేదన పడొద్దని వెంకట్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్కు రాజీనామా చేస్తే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అక్కడ టికెట్ దొరక్కపోవడంతోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తల సూచన మేరకే అభ్యర్ధిని నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.
ALso Read: బీఆర్ఎస్కు రాజీనామా చేస్తే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలా.. వలస నేతలపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పాలనలో చాలామందికి రైతుబంధు అందలేదని.. కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదన్నర గంటలు మాత్రమే కరెంట్ ఇస్తోందని వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా ఖరారవుతుందని.. వచ్చేది మన ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరపున అన్ని స్థానాలకు అభ్యర్ధులు వున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్పై రేవంత్ నోరు జారితే తాను లాగ్ బుక్ను బయటపెట్టి నష్ట నివారణా చర్యలు చేపట్టానని చెప్పారు.
